సంఖ్యా.. 34. మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను గదేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు. దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది. అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది. అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది. మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.) హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది. తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు. మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది. షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) పక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది. తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.” కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి. రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు. ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.” అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: “దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు. ఆ నాయకుల పేర్లు ఇవి: యూదా వంశంనుండి — యెపున్నె కుమారుడు కాలేబు; షిమ్యోను వంశంనుండి — అమ్మిహూదు కుమారుడు షెమూయేలు; బెన్యామీను వంశంనుండి — కిస్లోను కుమారుడు ఎలీదాదు దాను వంశంనుండి — యొగ్లి కుమారుడు బుక్కి మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి ఏఫోదు కుమారుడు హన్నీయేలు ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి — షిఫ్తాను కుమారుడు కెమూయేలు జెబూలూను వంశంనుండి — పర్నాకు కుమారుడు ఎలీషాపాను ఇశ్శాఖారు వంశంనుండి — అజ్ఞాను కుమారుడు పల్తీయేలు ఆషేరు వంశంనుండి — షెలోమి కుమారుడు అహీహోదు నఫ్తాలి వంశంనుండి — అమ్మీహోదు కుమారుడు పెదహేలు.” ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు.